*సైబర్ మోసగాళ్ల చేతికి రూ. 54 వేల కోట్లు
ఆకేరు న్యూస్,న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు రూ. 54 వేల కోట్ల రూపాయల మేర ప్రజల సొమ్ము సైబర్ దొంగల పాలవ్వడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.సైబర్ నేరాల ద్వారా జరుగుతున్న దోపిడీ కొన్ని చిన్న రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.రిజర్వ్ బ్యాంక్ (RBI), టెలికాం శాఖలతో సంప్రదింపులు జరిపి, సైబర్ నేరాల నివారణకు పటిష్టమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర హోం శాఖను కోర్టు ఆదేశించింది.నిబంధనల రూపకల్పన మరియు వాటి అమలుకు సంబంధించిన కార్యాచరణను నాలుగు వారాల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేరాల వెనుక బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు ఉండే అవకాశం ఉందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. భారీగా నగదు విత్ డ్రా అవుతున్నప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని కోర్టు తేల్చి చెప్పింది. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులను అప్రమత్తం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను ఎందుకు ఉపయోగించడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది.డిజిటల్ అరెస్టుల వంటి సంక్లిష్టమైన కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
____________________________________________________
