ఆకేరు న్యూస్,హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సిబ్బంది తీరు మరోసారి వివాదాస్పదమైంది. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లి పట్ల సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థినిని చూడటానికి ఆమె తల్లి క్యాంపస్కు వచ్చారు. అయితే సమయం మించిపోవడంతో, రాత్రికి హాస్టల్లోనే ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని ఆమె కోరారు. ఇందుకు హాస్టల్ యాజమాన్యం ససేమిరా అనడమే కాకుండా, కనీస మానవత్వం లేకుండా ఆమెను అవమానించినట్లు తెలుస్తోంది.రాత్రి వేళ ఒంటరిగా ఒక మహిళ ఎక్కడికి వెళ్తుందని విద్యార్థి సిబ్బందిని ప్రశ్నించినప్పటికీ, వారు కనికరం చూపకుండా బయటకు వెళ్లాలని చెప్పడంతో వివాదం ముదిరింది.తమ తోటి విద్యార్థిని తల్లికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అర్ధరాత్రి నుండే విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.బాధ్యులైన హాస్టల్ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రవర్తించేలా నిబంధనలు ఉండాలి.యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం విద్యార్థి సంఘాలు వేచి చూస్తున్నాయి.
