* 12 నెలకి 13 సార్లు రీఛార్జ్ టెలికాం కంపెనీల లూటీ
– 28 రోజుల ప్లాన్ స్కామ్..
* ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ ఆపడం అన్యాయం
* పార్లమెంటులో గళమెత్తిన ఎం.పీ. రాఘవ్ చద్ధా
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటే 28 రోజుల ప్లాన్తో 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుందనీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా బుధవారం రాజ్యసభలో గళమెత్తారు. దేశంలో 125 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో 90 శాతం ఉన్న ప్రీపెయిడ్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు చేస్తున్న అన్యాయం lసామాన్య ప్రజల జీవితాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.రీఛార్జ్ ముగిసిన తర్వాత అవుట్గోయింగ్ కాల్స్ ఆగడం సహజమే అయినప్పటికీ, ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆపేయడం ఎందుకన్నారు. రీఛార్జ్ అయిపోతే మీకు ఎవరూ కాల్ చేయలేరు, OTPలు రావు. అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తి నిస్సహాయుడు అవుతాడు అని పార్లమెంట్లో అన్నారు. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటే, 28 రోజుల ప్లాన్తో 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుందనీ, 28×13=364 రోజులు మాత్రమే వస్తాయి. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ స్కామ్ అని ఆయన అన్నారు. ప్లాన్ల వాలిడిటీ క్యాలెండర్ నెలలు 30 -31 రోజులు ప్రకారం ఉండాలని డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్ సామాన్య ప్రజల అవసరం అని రాఘవ్ చడ్ఢా స్పష్టం చేశారు. టెలికాం కంపెనీలు వినియోగదారులతో న్యాయమైన, పారదర్శక వైఖరి అవలంబించాలని పార్లమెంట్ ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ అంశంపై రాఘవ్ చడ్ఢా పార్లమెంట్లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
