*ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ :
అమాయక రైతులను అధిక వడ్డీలతో నడ్డి విరుస్తున్న పాన్ బ్రోకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు అక్కనపల్లి నర్సింహులు, గద్ద కుమార్ కోరారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంకి చెందిన నర్సింహాలు, కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం నర్సింహులు మాట్లాడుతూ డివిజన్ కేంద్రంలోని ఓం గణేష్ మార్వాడి షాపు యజమాని పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీమీద వడ్డీలు బారువడ్డీ, చక్రవడ్డీ వసూలు చేస్తూ పేదప్రజలను నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం డివిజన్ కేంద్రంలోని ఓం గణేష్ మార్వాడి షాపులో 17 మే 2022 న 30 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక లక్ష రూపాయల అప్పు తీసుకున్నామని అన్నారు. సంవత్సరం తరువాత అప్పు తాలూకు డబ్బులు చెల్లించాలని వెళ్లగా ఐదుశాతం వడ్డీ చెల్లించి నీబంగారం తీసుకపో లేదంటే దిక్కున్నచోట చెప్పుకోమని నానా బూతులు తిట్టారని అన్నారు. మరల కొద్ది రోజుల తర్వాత వెళ్ళి అడిగితే వడ్డీల మీద వడ్డీలు వేసి మొత్తం 4,50,000 అక్షరాల నాలుగు లక్షల యాబైవేల రూపాయలు చెల్లిస్తే నీ బంగారం ఇస్తా అని చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గద్ద కుమార్ మాట్లాడుతూ నాయెక్క అవసర నిమిత్తం 10 ఏప్రిల్ 2024 న 5 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి 12,000 వేలు, 4 జనవరి 2025 న 11,300 మిత్తి 2 శాతం చొప్పున అప్పు తీసుకున్నామని అన్నారు. 20 ఫిబ్రవరి 2026 న డబ్బులు చెల్లించేందుకు వెళ్లగా అసలుకు 6 శాతం వడ్డి చెల్లించి బంగారం తీసుకెళ్లాలని తెలిపారని అన్నారు. ఈ విషయమై ఓం గణేష్ యజమానిని నిలదీయగా, వారిద్దరు కుమారులు ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద రైతు కుటుంబాల దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేస్తూ చక్రవడ్డీ వసూలు చేస్తున్న ఓం గణేష్ పాన్ బ్రోకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించినట్లు తెలిపారు. మానవ దృక్పథంతో రైతులకు అన్యాయం జరగకుండా షాపులు సీజ్ చేసి మా బంగారాన్ని మాకు ఇప్పించగలరని సభందిత అధికారులను కోరారు. రైతులకు సరైన న్యాయం జరగకపోతే పెద్దఎత్తున ఆందోళనల కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
