* ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే నిజమైన నివాళి
ఆకేరు న్యూస్, హనుమకొండ : భగత్ సింగ్ కలలను సాకారం చేద్దాం.. యువత ముందుకు రావాలని అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వర్ధంతిని సోమవారం
AIYF ఆధ్వర్యంలో వరంగల్ పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వలస పాలకులపై వీరోచిత పోరాటం చేసి అమరులయ్యారని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు స్వేచ్ఛా భారతాన్ని అందించేందుకు వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భగత్ సింగ్ కలలుగన్న సమసమాజం, కుల-మత భేదాలు, ధనిక-పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమాజ నిర్మాణం—నేటికీ సాధించాల్సిన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మతోన్మాద రాజకీయాలను సమూలంగా ఎదుర్కొని, సెక్యులర్, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే భగత్ సింగ్కు ఇచ్చె నిజమైన నివాళి అని అన్నారు. పాఠ్యాంశాల్లో భగత్ సింగ్ జీవిత చరిత్రను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో “డ్రగ్స్కు వద్దు – స్పోర్ట్స్ ముద్దు” నినాదంతో జిల్లా వ్యాప్తంగా యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి మక్సూద్ సుధీర్, జగదీష్, లక్ష్మి, విజయ, దేవి, షబానా, తబ్సీం, మహేష్, రాజేష్, జాను, రవి తదితరులు పాల్గొన్నారు.
