* టిప్పర్ లారీ- ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ
* ఏపీ రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆధ్రప్రదేశ్ లోని మార్కాపురం సమీప రాయవరం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ- ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈఘటనలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వారంతా సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంఘటన విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని స్థానికుల సహకారంతో మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలమంతా మాంసం ముద్దలతో భయానకంగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తోపాటు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
నిర్మల్ నుంచి బయలుదేరి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ సీఎస్తో మాట్లాడారు.
స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్
రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ఆరాతీశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

