* మామిడి మొక్క నాటిన కమిషనర్
ఆకేరు న్యూస్, వరంగల్ (సంగెం): పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని పోలీసులు కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం ఆయన సంగెం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును సమీక్షించారు.
అనంతరం ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో గ్రామాల పరిస్థితులు, స్థానికంగా జరుగుతున్న నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్ నిర్వహణలో అలసత్వం వహించొద్దని, నమోదైన, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
పోలీసులకు కీలక ఆదేశాలు
“పోలీసులు ప్రజల విశ్వాసం పొందేలా విధులు నిర్వర్తించాలి. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకమైన సేవలు అందించాలి” అని సీపీ సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై వంశీ కృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
