* చమురు సంక్షోభం – లాక్డౌన్ ఏమీలేదు
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ క్లారిటీ
ఆకేరు న్యూస్ , డెస్క్: దేశంలో చమురు కొరత ఏర్పడనుందని, ఆ కారణంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించే యోచనలో ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేస్తూ, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇచ్చారు.
పుకార్లు నమ్మకండి!
లాక్డౌన్పై జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. “లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రజలు ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఈ సందర్భంగా మంత్రి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు..
బాధ్యతాయుతంగా ఉండండి. ఇలాంటి సున్నితమైన సమయాల్లో ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కొందరు కావాలనే రూమర్లను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలు (Panic) సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యం మరియు హానికరం. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి, అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
చమురు సరఫరాపై ధీమా..
దేశంలో ఇంధన నిల్వలు మరియు సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను షేర్ చేసే ముందు వాటి వాస్తవికతను సరిచూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
