* ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది
* రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలి
* తెలంగాణ ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా..
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేశారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 25న ఉదయం ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం నిజామాబాద్లో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యపై పోటారం చేసే బలమైన రాజకీయ శక్తి కావాలి.. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ అవతరంచనుందని చెప్పారు.
ప్రజలు ఆలోచించాలి..
తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది.. అయినా నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం.. ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలని కోరారు. కొత్త రాజకీయ పార్టీ ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. నేను నిజామాబాద్ కోడలిని.. తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ నుంచి తీసుకునే ఆలోచన, నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేస్తుందని కవిత అన్నారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. తమ పార్టీ మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. “ఇన్నాళ్లూ మగవాళ్లు పెట్టిన పార్టీలను చూశారు, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా” అని ఆమె అన్నారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఒక ఆడబిడ్డగా పార్టీ పెడుతున్నాను అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని, రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడమే తన లక్ష్యమని స్ఫష్టం చేశారు.
20 రోజులుగా మార్క్ఫెడ్ను ఎందుకు ఓపెన్ చేయడం లేదని ప్రశ్నించారు.
