ఆకేరు న్యూస్, హైదరాబాద్: లోక్ అదాలత్ ద్వారా గరిష్ట స్థాయిలో కేసుల పరిష్కారమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని సెంట్రల్ జోన్ డీసీపీ తార కవిత పేర్కొన్నారు. లోక్ అదాలత్ నిర్వహణపై ఆమె ప్రసంగిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. ఈ ఏడాది మొదటిసారిగా పోలీస్ కమిషనర్ (CP) గారి ఆదేశాల మేరకు పోలీస్ విభాగం తరపున లోక్ అదాలత్ నిర్వహణలో పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే మా బృందాలన్నీ క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, గరిష్ట స్థాయిలో కేసులను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆమె వివరించారు.
*ప్రీ-లోక్ అదాలత్ ద్వారా సత్ఫలితాలు:
లోక్ అదాలత్ కంటే ముందే నిర్వహించిన ‘ప్రీ-లోక్ అదాలత్’ సెషన్లలో ఇప్పటికే అనేక కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయని ఆమె గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. “రాజీ మార్గమే రాజమార్గం” అనే నినాదాన్ని (Tagline) నిజం చేస్తూ, అందరి సహకారంతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. తద్వారా కోర్టుల మీద భారం తగ్గడమే కాకుండా, కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని డీసీపీ తార కవిత ఆకాంక్షించారు.
*పరిష్కరించే కేసులు..
కేవలం సాధారణ భారతీయ న్యాయ సంహిత (BNS) కేసులు మాత్రమే కాకుండా, ఈ క్రింది కేసులపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు డీసీపీ స్పష్టం చేశారు:
ప్రత్యేక మరియు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు (Special & Local Laws).
సైబర్ క్రైమ్ రీఫండ్ (Cyber Crime Refunds) సంబంధిత అంశాలు.
ఈ-పెట్టీ (e-Petty) కేసులు.
