ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
బాంబు బ్లాస్టింగ్ తో రాళ్లు ఎగిరి పడి రైతుల పాలిట శాపంగా మండలంలోని ఇప్పగూడెం శివారు రంగరాయగూడలో
ఏర్పాటు చేసిన క్రషర్ తో రైతుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం క్రషర్ దగ్గర బాంబు బ్లాస్టింగ్ చేయగా సమీప వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు దగ్గర్లో పెద్ద పెద్ద బండ రాళ్లు ఎగిరిపడి త్రుటిలో ప్రమాదాలు తప్పాయని అన్నారు. రైతులు లింగనబోయిన రాములు అనే రైతు పొలాల్లో పడ్డ రాళ్లను చూపినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న క్రషర్ ను వాటి పర్మిషన్లను అధికారులు పరిశీలించాలని కోరారు. అధిక మొత్తంలో బాంబుల ముడి సరుకులు వాడటం వల్ల భారీ శబ్దంతో బాంబ్ బ్లాస్టింగ్ సంఘటనలు జరుగుతున్నాయని దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు. ఈ క్రషర్ నడవడం వల్ల ప్రకృతి విధ్వంసం అవ్వడంతో పాటు జంతువులు చెల్లాచెదురు అయ్యాయని భవిష్యత్తులో భారీ పేలుళ్లతో భూగర్భ జలాల పై కూడా ప్రభావం పడుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశంలోనే క్రషర్లపై సిబిసిఐడి ఎంక్వైర్లు జరుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఈ కోరగుట్ట క్రషర్ పై కూడా సిబిసిఐడి ఎంక్వయిరీ జరిపి రైతులను కాపాడాలని కోరారు. ఈ సమస్యపై సిపిఎం పార్టీ తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగరాయగూడం గ్రామ ఉపసర్పంచ్ మునిగే నరసింహులు, ఇప్పగూడెం ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు, సిపిఎం నాయకులు జిల్లాపెళ్లి కొమురయ్య, రడపాక యాదగిరి, రైతు లింగనబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.
