* మరో మహిళతో ఎంఆర్వో సహజీవనం..
* రోడ్డుపైకి వచ్చిన భార్యాపిల్లలు..
*పోలీస్ స్టేషన్ ముందు MRO భార్యాపిల్లల ఆందోళన
ఆకేరు న్యూస్, హన్మకొండ: ఒకవైపు సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, మరోవైపు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను నడిరోడ్డుపై వదిలేశారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ములుగు జిల్లా వెంకటాపురం ఎంఆర్ఓ (MRO) గిరిబాబు వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
* అసలేం జరిగింది?
బాధితురాలు ఝాన్సీ రాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త గిరిబాబు ములుగు జిల్లా వెంకటాపురంలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, గత ఐదేళ్లుగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో సహజీవనం (Live-in Relationship) చేస్తున్నారని ఝాన్సీ రాణి ఆరోపించారు.
* పిల్లల ఆవేదన – కన్నీటి పర్యంతమైన కుటుంబం
ఐదేళ్లుగా తండ్రి ప్రేమకు దూరమైన ఇద్దరు పిల్లలు, తమ తండ్రి తమ వద్దకు రావాలంటూ హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. “మా డాడీ మా వద్దకు రావాలి.. మాకు న్యాయం చేయాలి” అంటూ వారు చేస్తున్న నినాదాలు చూసేవారిని కలచివేస్తున్నాయి. భార్యాపిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళతో ఉంటున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమను మళ్ళీ ఆదుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
