Errabelli Dayakar Rao
ఆకేరు న్యూస్, తొర్రుర్ డివిజన్ :
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికా పర్యటనలో భాగంగా వెస్ట్ వర్జీనియాలోని ప్రముఖ వైన్ యార్డు (ద్రాక్ష తోటలు, వైన్ తయారీ కేంద్రం ను సందర్శించారు.
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త రంగా చెగువ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వైన్ యార్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రంగా చెగువ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం తోటల్లో అత్యాధునిక సాంకేతికతతో సాగు చేస్తున్న వివిధ రకాల పండ్ల తోటలను, అరుదైన పూల మొక్కల పెంపకాన్ని ఎర్రబెల్లి ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా వైన్ తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ద్రాక్ష పండ్ల సేకరణ నుండి వైన్ బాట్లింగ్ వరకు జరిగే పూర్తి ప్రక్రియను అక్కడి నిపుణులు, వ్యాపారవేత్త రంగా చెగువ మాజీ మంత్రికి వివరంగా పవర్పాయింట్ ప్రెజెంటేషన్ మరియు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగు చేస్తున్న విధానాన్ని, వైన్ నాణ్యతను కాపాడటానికి తీసుకుంటున్న జాగ్రత్తలను ఎర్రబెల్లి అడిగి తెలుసుకున్నారు.
వైన్ యార్డులోని అద్భుతమైన పండ్ల, పూల మొక్కల తోటలను, వైన్ తయారీ నిర్వహణను చూసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంతగానో అభినందించారు. విదేశాల్లో తెలుగువారు వ్యాపార రంగంలో తమ ప్రతిభను చాటుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస భారతీయులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.
