Kamalapur Arrive Alive Awareness
* రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు విద్యార్థుల లేఖలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు కమలాపూర్ పోలీసులు అర్రైవ్-అలైవ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్ సూచన మేరకు, బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు లేఖలు రాసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు గూడూరు – కమలాపూర్ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా కమలాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ విద్యార్థులతో మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులని, విద్యార్థులు తాము ట్రాఫిక్ నియమాలను పాటిస్తూనే..తమ ఇళ్లలో తల్లిదండ్రులకు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాల పట్ల అవేర్నెస్ కల్పించాలని అన్నారు. విద్యార్థులందరితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. నాన్న జాగ్రత్తగా వెళ్లండి, హెల్మెట్ ధరించండి అంటూ విద్యార్థులు రాసిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్లో వేశారు. పిల్లల కోరికను మన్నించి, ప్రతి ఒక్కరూ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అని సిఐ అన్నారు.

కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత పట్ల పిల్లలు చెబితే వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతుందని, విద్యార్థులు మంచి చెడును గుర్తిస్తూ బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంగా ప్రముఖ అడ్వకేట్ బండి కళాధర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతను పాటిస్తూ బాధ్యతగా వాహనాలు నడపాలని, రాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు.
కార్యక్రమంలో ఎస్ఐ వి.దిలీప్, గూడూరు గ్రామ సర్పంచ్ బండి వనజ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి…
