Kadiyam Kavya protest Telangana Parliament
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ సెగలు రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి శుక్రవారం పార్లమెంట్ లోపల ప్రవేశ ద్వారం వద్ద భారీ నిరసన చేపట్టారు. చేతుల్లో ఫ్లాకార్డులు పట్టుకుని, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
*అమరవీరుల త్యాగాలను అవమానిస్తారా
ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, అది దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరవీరుల బలిదానాల ప్రతిరూపమని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అటువంటి పవిత్రమైన తెలంగాణ ఆవిర్భావాన్ని రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వీ సూర్య అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
*బీజేపీకి తెలంగాణ అంటే ఎందుకంత కక్ష?
కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి తెలంగాణ అంటే మొదటి నుంచి వ్యతిరేక భావన ఉందని కడియం కావ్య విమర్శించారు. గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని వ్యాఖ్యానించడాన్ని ఆమె గుర్తు చేశారు. “రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా, ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ కలను సాకారం చేశారు. కానీ, బీజేపీ మాత్రం తెలంగాణ ఏర్పాటును ఒక ‘బ్లాక్ డే’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది” అని ఆమె ధ్వజమెత్తారు.
*బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే!
తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ సూర్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ నాయకత్వం తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొని, రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడుతామని ప్రకటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
