Medaram UNESCO Intangible Heritage Telangana
* యునెస్కో ‘ఇంటాంజిబుల్ హెరిటేజ్’ లక్ష్యంగా భారీ కసరత్తు
ఆకేరు న్యూస్, ములుగు:
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించడంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. పాపారావు ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ప్రకటించారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను యునెస్కో (UNESCO) ‘అమూర్త సాంస్కృతిక వారసత్వ’ (Intangible Cultural Heritage) జాబితాలో చేర్చడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం, ములుగు కలెక్టర్ కార్యాలయం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
* పన్నెండేళ్ల కృషి.. ఇక మేడారం ప్రపంచ ఖ్యాతి కోసం
పన్నెండేళ్ల కృషి.. రామప్ప స్ఫూర్తితో ముందడుగు…
గత 12 ఏళ్లుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేసి రామప్ప గుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన అనుభవంతో, ఇప్పుడు మేడారం జాతరపై దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి సీతక్క మరియు ములుగు కలెక్టర్ పదేపదే చేసిన అభ్యర్థన మేరకు, ఈ మెగా జాతరను ప్రపంచ వేదికపై నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
* గిరిజన సంస్కృతికి ప్రపంచ వేదిక – తాడ్వాయి జాతీయ సెమినార్
ఈ ప్రతిపాదనను శాస్త్రీయంగా ధృవీకరించేందుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ములుగు జిల్లా తాడ్వాయి వేదికగా ఒక భారీ నేషనల్ సెమినార్ నిర్వహించనున్నారు. ఈ సెమినార్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆంథ్రపాలజిస్టులు (మానవ శాస్త్రవేత్తలు), సోషలజిస్టులు, ఇంటాంజిబుల్ హెరిటేజ్ నిపుణులు మరియు వారసత్వ సంపద నిపుణులు పాల్గొంటారు. మేడారం జాతర అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. అది గిరిజన సంస్కృతి, నమ్మకాలు మరియు తెలంగాణ ప్రజల అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపం. ఈ సంప్రదాయాలను యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా డాక్యుమెంట్ చేసి, పక్కా రిపోర్టును సిద్ధం చేయడం ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశ్యం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వరంగల్ కేంద్రంగా ఈ సన్నాహక పనులు ఇకపై నిరంతరం కొనసాగుతాయని పాపారావు స్పష్టం చేశారు.
