Raghav Chadha BJP AAP
* నేను రాంగ్ పార్టీలో ఉన్నాను
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావం నుండి అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ ముఖచిత్రంగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు ఆయన ఆప్కు రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేవలం ఆయన ఒక్కరే కాకుండా, మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు కూడా కమలం గూటికి చేరడం ఆప్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
* రాజ్యసభలో ఆప్ పక్షం విలీనం
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో 7 మంది ఒకేసారి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాఘవ్ చడ్డా నేతృత్వంలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక పార్టీలోని 2/3 వంతు మంది సభ్యులు మరో పార్టీలో చేరితే, వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడదు. ఈ సాంకేతిక వెసులుబాటును ఉపయోగించుకుంటూ, తమ బృందాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఈ ఏడుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్కు అధికారికంగా లేఖ సమర్పించారు.
* నా గొంతు నొక్కారు”-రాఘవ్ చడ్డా ఆవేదన…
బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చడ్డా విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. “నేను ఆప్ వ్యవస్థాపక సభ్యుడిని.. పార్టీని నా రక్తాశ్రువులతో నిర్మించాను. కానీ, కొంతకాలంగా పార్టీలో నా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. నేను ఇంతకాలం రాంగ్ పార్టీలో ఉన్నానని ఆలస్యంగా గుర్తించాను. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ నాయకత్వమే సరైనదని భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
* పదవుల పంపకమే చిచ్చుకు కారణమా?
ఈ నెల 2వ తేదీన రాఘవ్ చడ్డాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను అశోక్ మిట్టల్కు అప్పగించినప్పటి నుండి పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. అయితే, ఆశ్చర్యకరంగా చడ్డా స్థానంలో నియమితులైన అశోక్ మిట్టల్ కూడా ఇప్పుడు ఆయనతో పాటే బీజేపీలో చేరడం గమనార్హం.
ఈ పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం కేవలం మూడుకు పరిమితమైంది. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న ఆప్కు ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
