Kamareddy Youth Suicide Incident
* భార్యతో గొడవ.. తుపాకీతో కాల్చుకుని యువకుడి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, కామారెడ్డి: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో ఓ యువకుడు నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
* దంపతుల మధ్య గొడవలు..
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా దంపతుల మధ్య చిన్నపాటి వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
* హెచ్చరించి మరీ ఆత్మహత్య..
గొడవ జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్ సింగ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తీవ్ర ఆవేశంతో “నేను ఇక బతకను.. చనిపోతున్నా” అంటూ భార్యను హెచ్చరించాడు. ఆ మాటలు అన్న వెంటనే గదిలోకి వెళ్లి, లోపల ఉన్న నాటు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దం విని కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూసేసరికి ఇంద్రజిత్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అక్కడికక్కడే అతను ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
* షాక్లో కుటుంబ సభ్యులు – గ్రామంలో విషాద ఛాయలు
కళ్లముందే ప్రాణాలు పోవడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక చిన్న గొడవ ఇంతటి ఘోరానికి దారితీస్తుందని వారు ఊహించలేకపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు భారీ సంఖ్యలో ఇంద్రజిత్ ఇంటికి చేరుకున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
* పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న లింగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన విషయం ఏమిటంటే.. అసలు ఇంద్రజిత్ సింగ్ వద్దకు నాటు తుపాకీ ఎలా వచ్చింది? అతనే తయారు చేసుకున్నాడా లేదా ఎవరైనా సరఫరా చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
