Solid Waste Management Awareness
ఆకేరు న్యూస్ రాయపర్తి:- ఘన వ్యర్ధాల నిర్వాహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ జి సంధ్యారాణి అన్నారు
మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రత్యేక గ్రామ సభ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ జి సంధ్యారాణి పాల్గొనగా మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కూచన ప్రకాశ్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఎంతగానో తోడ్పడతాయని, వీటిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
తహసిల్దార్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలలో గ్రామీణులు చురుగ్గా పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని సూచించారు .
మండల పరిషత్ అభివృద్ధి అధికారి కూచన ప్రకాశ్ మాట్లాడుతూ, పచ్చని పర్యావరణం కోసం ప్రజలు తమ సామాజిక బాధ్యతగా ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ ట్రాక్టరుకు అందించాలని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను (Solid Waste Management Rules) ప్రతి ఒక్కరూ విధిగా పాటించి కొత్తూరు గ్రామాన్ని ఆదర్శవంతమైన స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై యువత అవగాహన పెంచుకోవాలని, గ్రామ సభ ద్వారా వచ్చే ప్రజా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో కొత్తూరు అభివృద్ధికి, స్వచ్ఛతకు, పాలకమండలి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిప్ప శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అస్మా, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
