Congress Voter List Review
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, నమోదు ప్రక్రియపై తమ దృష్టిని సారించాయి. హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుడా మాజీ చైర్మన్, హుజూరాబాద్ సర్ ఇంచార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కమలాపూర్, వీణవంక మండల పరిధిలోని గ్రామాల బిఎల్ఏలు, కో-ఆర్డినేటర్లతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బిఎల్ఏల పనితీరు, వార వద్ద ఉన్న సమాచారం కో-ఆర్డినేటర్ల వద్ద సరిగ్గా ఉందో లేదో నేతలు పరిశీలించారు. గ్రామాల్లో ఓటు నమోదుకు సంబంధించి దరఖాస్తు ఫారాలు అందకపోతే బిఎల్ఏలు వెంటనే కో-ఆర్డినేటర్లకు తెలపాలని, అక్కడి నుండి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పరిగణిస్తోందని, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారని నేతలు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక మండలాల ముఖ్య నాయకులు, గ్రామ స్థాయి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
