Harish Rao Congress Criticism
ఆకేరు న్యూస్, కరీంనగర్:
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రతిపక్ష పార్టీల శ్రేణులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి పోయిందని, అభివృద్ధి శూన్యమై.. విధ్వంసం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.
* స్కీమ్ల స్థానంలో స్కామ్లు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని హరీష్ రావు ఆరోపించారు. “రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే స్కీమ్లు ఎక్కడా కనిపించడం లేదు.. కానీ కాంగ్రెస్ నాయకుల స్కామ్లు మాత్రం ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి” అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* మంత్రులకు సవాళ్లు.. శాఖలపై అవగాహన లేదు…
కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు తనపై చేస్తున్న విమర్శలకు హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. స్థానిక మంత్రులు తనకు పెద్ద పెద్ద సవాళ్లు విసురుతున్నారని, కానీ వారి సొంత శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే కనీస అవగాహన కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. “ఎనుముల సోదరులు తెరవెనుక చేస్తున్న కార్యకలాపాలు, వ్యవహారాల గురించి సంబంధిత మంత్రులకు ఏమాత్రం సమాచారం లేదు. అలాంటి వారు మనకు నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని వ్యాఖ్యానించారు.
* ఢిల్లీకి మూటలు.. అధికారుల్లో నమ్మకం పోయింది..
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల కోసం, ఢిల్లీ పెద్దల కోసం మూటలు కట్టి పంపుతున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లోనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోనూ పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. “ఈ ప్రభుత్వ కాలపరిమితి ముగింపు దశకు చేరుకుందని రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు సైతం స్పష్టంగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలను, ఆయన మాటలను అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు” అని హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల వైఫల్యాలను, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్కు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు.
