Pawan Kalyan Warangal Visit
* రేపు వరంగల్కు పవన్ కళ్యాణ్
* బాలుడి చివరి కోరిక మేరకు
ఆకేరు న్యూస్, వరంగల్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కోరికను నెరవేర్చేందుకు ఆయన స్వయంగా తరలివెళ్తున్నారు.
హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ప్రస్తుతం తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో, తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా చూడాలన్నది ఆ బాలుడి కోరిక. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.
బాలుడి పరిస్థితిపై చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం, రేపు (బుధవారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా హనుమకొండలోని బాలుడి నివాసానికి నేరుగా వెళ్లి, నిరంజన్ను పరామర్శించనున్నారు.
బాలుడికి ధైర్యం చెప్పడమే కాకుండా, వారి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో కీలక బాధ్యతల్లో ఉంటూ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఓ బాలుడి కోరిక కోసం పవన్ కళ్యాణ్ వస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
