Medak Pregnant Woman Suicide
ఆకేరు న్యూస్, మెదక్: అనుమానపు భూతం ఒక నిండు గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదేనా అంటూ భర్త, అత్త చేసిన మానసిక నరకం తట్టుకోలేక ఐదు నెలల గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది.
* స్థానిక వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన సుస్మితకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అయితే, గత కొంతకాలంగా సుస్మిత ప్రవర్తనపై భర్త, అత్త తీవ్రంగా అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే కడుపులో పెరుగుతున్న శిశువుకు DNA టెస్ట్ (పితృత్వ పరీక్ష) చేయించాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
కట్టుకున్న భర్తే తన పవిత్రతను శంకిస్తూ, కడుపులోని బిడ్డపై అనుమానం వ్యక్తం చేయడంతో సుస్మిత తీవ్ర మనస్తాపానికి గురైంది. అత్తింటి వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో, భరించలేక ఆమె బుధవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
* హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు-తల్లి ఆరోపణ..
సుస్మిత మృతిపై ఆమె పుట్టింటి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్తింటివారే ఆమెను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించారు. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసమో, లేదా ఇతర కారణాలతోనో సుస్మితను హింసిస్తున్నారని, ఇప్పుడు గర్భంపై లేనిపోని నిందలు వేసి ప్రాణాలు తీశారని కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులైన భర్త, అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* రంగంలోకి దిగిన పోలీసులు..
ఘటనపై సమాచారం అందుకున్న అల్లాదుర్గ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించడం (Abetment to Suicide) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక నిండు ప్రాణం, కడుపులోని అర్భకుడు ఇలా అనుమానానికి బలికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
