Keshavapur Cleanliness Awareness Program
* గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత
-సర్పంచ్ గూజ సుధాకర్
ఆకేరు న్యూస్,రాయపర్తి:
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం గ్రామ సర్పంచ్ గూజ సుధాకర్ అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణంలో స్వచ్ఛతపై గ్రామ ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రాంగణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరించేందుకు వీలుగా నాలుగు డస్ట్బిన్లను (డంపింగ్ బిన్లు) ఆయన ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, తడి చెత్తను మరియు పొడి చెత్తను వేర్వేరుగా వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని కోరారు.
* చెత్త నిర్వాహణపై అవగాహన
”కూరగాయల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాల వంటి వాటిని తడి చెత్తగానూ.. ప్లాస్టిక్, కాగితాలు, గాజు ముక్కలు వంటి వాటిని పొడి చెత్తగానూ వర్గీకరించి వేయాలి. ఈ విధి విధానాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించినప్పుడే గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారుతుంది.” అని సర్పంచ్ ప్రజలకు వివరించారు.
గ్రామస్తులందరూ సమన్వయంతో పారిశుధ్య నియమాలను పాటించి, కేశవాపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
