
* అమరులైన పోలీసు కుటుంబాలకు భారీ పరిహారం
* పోలీసు సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు
* సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమరులైన పోలీసు కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) భారీ పరిహారం ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(police commemoration day) సందర్భంగా గోషామహల్లోని పోలీస్ స్టేడియంలో నివాళి అర్పించిన రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు సంక్షేమానికి ఏటా రూ. 20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో అమరవీరులైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కుటుంబాలకు రూ. కోటి, ఎస్ఐ, సీఐలకు రూ.1.25కోట్లు, డీఎస్సీ, ఏఎస్పీ, ఎస్పీ కుటుంబాలకు రూ.1.5కోట్లు, ఐపీఎస్ కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం అందించనున్నట్లు రేవంత్ కీలక ప్రకటన చేశారు. మావోయిస్టుల చేతిలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు.
140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణమని తెలిపారు. డ్రగ్స్(Drugs), గంజాయి(Ganjay) కట్టడికి టీ న్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ క్రైమ్ (Cyber Crime)ఛేదనలో తెలంగాణను కేంద్రం మెచ్చుకుందని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్(Hyderabad Traffic) నియంత్రణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ముత్యాలమ్మ గుడి ఘటనలో నిందితులను వదిలిపెట్టబోమని ప్రకటించారు. హైదరాబాద్లో ప్రశాంతంగా పండుగల నిర్వహణలో పోలీసుల పాత్ర మరువలేమని, వారు జీతం కోసం పనిచేయడం లేదని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని పోలీసుల సేవలను కొనియాడారు.
…………………………………………………….