
* తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నా..
* అందుకే ఈ లేఖ రాస్తున్నా
* కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని, తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నానని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వెల్లడించారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఫిరాయింపు చట్టం లొసుగులతో పార్టీ మారుతున్నారని తెలిపారు. సంక్షేమ పరంగా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ మంచి పేరు పొందుతున్న పార్టీలో ఫిరాయింపులు చేటు తెస్తున్నాయన్నారు. కార్యకర్తలను సైతం ఇటువంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు. సంఖ్యా బలంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని, ప్రజలు పార్టీకి మద్దతుగా నిలిచారని లేఖలో వివరించారు. రాష్ట్రం మెుత్తం కాంగ్రెస్ పాలన సాగుతుంటే జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పాలన సాగుతోందని జీవన్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని గతంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాందీ అన్నారని గుర్తు చేశారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకున్నానని. ఇప్పుడు ఆ నాయకులే కాంగ్రెస్లో చేరి పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నా.. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని నేను లేఖ ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలిపా. రాష్ట్ర కాంగ్రెస్లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా. తీవ్ర మానసిక వేదనతో హైకమాండ్కు లేఖ రాస్తున్నా. కానీ ఇలా చేయాల్సి వస్తున్నందుకు విచారిస్తున్నా. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఠా కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డిని సంతోష్ అనే యువకుడితో చంపించింది. “ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా సంతోష్ పని చేశాడు. గతంలో కూడా నిందితుడు సంతోష్ బీఆర్ఎస్ నేతల అండ చూసుకుని రెచ్చిపోయాడు. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్గా తన తరఫున ప్రతిపాదించా. ఎవరి అండ చూసుకుని గంగారెడ్డిని సంతోష్ మట్టుబెట్టాడో అందరికీ తెలుసు” అని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
……………………………………………………….