Vande Bharat TTE Scam Bihar Railway Division
* టీటీఈ నిర్వాకంపై రైల్వే శాఖ సీరియస్, నిమిషాల్లో వేటు
ఆకేరు న్యూస్, డెస్క్: భారతీయ రైల్వే గర్వకారణంగా భావించే వందే భారత్ ఎక్స్ప్రెస్లో అవినీతి వెలుగుచూసింది. ప్రయాణికులతో నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల విషయంలో బేరసారాలు ఆడుతూ ఒక టీటీఈ (TTE) కెమెరాకు చిక్కాడు. ఈ ఘటన బీహార్లోని దానాపూర్ రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది.
* బోగిలో బేరసారాలు…
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వద్దకు వచ్చిన టీటీఈ.. టికెట్ కావాలని అడిగాడు. ఆ ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడంతో, టీటీఈ ఒక ‘స్పెషల్ ఆఫర్’ ఇచ్చాడు. అధికారికంగా రూ. 700 ఉండే టికెట్ను కేవలం రూ. 380 చెల్లిస్తే చాలు అని, తాను మేనేజ్ చేస్తానని చెప్పాడు. అయితే ఇది అధికారికం కాదని, రసీదు ఇవ్వడం కుదరదని కూడా ఆయన స్పష్టం చేశాడు.
* ప్రయాణికుడి స్ట్రింగ్ ఆపరేషన్…
అయితే ఆ ప్రయాణికుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి, టీటీఈ చేస్తున్న ఈ బేరసారాలను తన మొబైల్లో రహస్యంగా రికార్డ్ చేశాడు. “ఇది రూల్స్కు విరుద్ధం కదా” అని ప్రయాణికుడు అడిగినా, టీటీఈ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకు అలవాటే అన్నట్లుగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా దావానంలా వ్యాపించింది.
* రైల్వే శాఖ తక్షణ చర్యలు…
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైల్వే శాఖను, రైల్వే మంత్రిని ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన రైల్వే సేవా (Railway Seva) మరియు దానాపూర్ డీఆర్ఎం (DRM Danapur), విచారణ జరిపి సదరు టీటీఈని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో కూడా ఇలాంటి అక్రమాలు జరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
