BJP Kamalapur Executive Meeting
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రానున్న రోజుల్లో బిజెపి నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కమలాపూర్ మండలం భీంపెళ్లిలోని రుద్రాణి ఫంక్షన్ హాల్లో బుధవారం బిజెపి మండల కార్యవర్గ సమావేశం మండలాధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలందరూ సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను పెంచాలని, కేవలం వాట్సాప్ వంటి సోషల్ మీడియాకే పరిమితమైతే నాయకులుగా ఎదగలేరని, అలాంటి వారి వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని హితవు పలికారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
అనంతరం మండలాధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపికి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, దానికి ఇటీవల మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. గ్రామస్థాయిలో బూత్ల వారీగా పార్టీ బలోపేతం కోసం ఆయన తన సొంత బృందాన్ని నియమించి మరీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలందరూ విభేదాలు పక్కనపెట్టి, సమష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు తోట సురేష్, మాజీ జెడ్పిటిసి వలిగే సాంబరావు, భూపతి ప్రవీణ్, జెట్టి సారంగపాణి, పెండ్యాల తిరుపతిరెడ్డి, నాసాని రాజు, బోగి భిక్షపతి, కొలను రాములు, శనిగరపు ఆనందం, సంపత్, సముద్రాల మొగిలి, మహంకాళి రమేష్, చెరిపెల్లి రతన్ కుమార్, వరికోలు రాజేందర్, మేడిపల్లి రాజు, పసునూటి రాణా ప్రతాప్, తూర్పాటి క్రాంతి, అపరాధి శ్రీనివాస్, ఎగోజు శ్రీనివాస్, తోట శంకరయ్య, రాంప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
