
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రతిపాదనలపై సమీక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు, తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26కి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చేరుకున్నాయి. అందులో భాగంగా ప్రతి శాఖ తమకు అవసరమైన నిధులను డిమాండ్ చేసినట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ప్రధానమైన అంశాలను, రాష్ట్రం గమనించాల్సిన ప్రతిపాదనలు, అలాగే గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికలను సమీక్షిస్తున్నారు.
దీంతోపాటు రాష్ట్ర మంత్రుల జాబితా, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య, రవాణా, వ్యవసాయం వంటి పలు రంగాలపై దృష్టిపెట్టి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో బడ్జెట్ 2025-26 రూపకల్పనపై ప్రాధాన్యత ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలించనుంది. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం అవసరమైన రుణాల కోసం సూచనలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం, మంత్రులు తమ శాఖల సమస్యలను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ చర్చించిన ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం మంత్రులు అవసరమైన సూచనలను అందిస్తారు. ఈ సమావేశం రాష్ట్ర ఆర్థిక వ్యూహాన్ని మెరుగుపరచడానికి కీలకమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
……………………………………….