Cockroach Janata Party Protest Delhi
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరియు విద్యావ్యవస్థలోని లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉద్యమం మొదలైంది. దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్న విద్యాశాఖలోని అక్రమాలకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఈ నిరసనల్లో గట్టిగా వినిపిస్తోంది.
* అమెరికా విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని..
ఈ అసాధారణ ఉద్యమానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్నతమైన ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని పక్కనబెట్టి, కేవలం దేశంలోని విద్యార్థులకు న్యాయం చేయడం కోసం ఆయన శనివారం (జూన్ 6) ఉదయమే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జూన్ 6వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చి శాంతియుత మార్గంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం ఒత్తిడి తెస్తానని ఆయన ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
* సామాజిక మాధ్యమం వేదికగా వినూత్న పిలుపు…
భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ విద్యార్థులకు, తన మద్దతుదారులకు ఒక ఆసక్తికరమైన పిలుపునిచ్చారు.
“నేను ఢిల్లీ చేరుకున్నాను. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు ఒక పుస్తకాన్ని, మన మువ్వెన్నెల జాతీయ జెండాను తీసుకురావడం మర్చిపోవద్దు. అంతేకాకుండా, శాంతికి మరియు మనకు రక్షణగా ఉండే పోలీసులపై గౌరవానికి చిహ్నంగా వారికి పూలు కానుకగా ఇవ్వండి. ప్రేమ, శాంతి మార్గాల్లోనే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని ఆయన పేర్కొన్నారు. దీంతో నిరసనకారులు బొద్దింకల ముసుగులు ధరించి, చేతుల్లో పుస్తకాలు పట్టుకుని జంతర్ మంతర్ వద్దకు భారీగా తరలివచ్చారు.
* న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి..
ఈ నిరసన ప్రదర్శనను అడ్డుకోవాలంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్ను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన బెంచ్.. ఈ పిటిషన్ను సాధారణ సమయాల్లోనే విచారిస్తామని స్పష్టం చేయడంతో, ఉద్యమానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అనంతరం ఢిల్లీ పోలీసులు కూడా జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శనకు అధికారికంగా అనుమతి ఇచ్చారు.
* తోడైన ప్రముఖ పర్యావరణవేత్త ‘సోనమ్ వాంగ్చుక్’ మద్దతు
ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. జూన్ 5 లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, తాను కూడా ఈ నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన ఇదివరకే హెచ్చరించడం ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల శాంతియుతంగా గుమిగూడాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. దేశ విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం సాగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
