
* డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్ర ప్రగతి పరుగులు
* రూ.430 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన
* పర్యాటక రంగంలో మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
* అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే 4 లక్షల మందికి ఉపాధి
* ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆకేరు న్యూస్, రాజమహేంద్రవరం : ‘రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో యువతకు ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (PAVAN KALYAN) అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. రూ.430 కోట్లతో ఈ రోజు రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని, త్వరలోనే రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ (RIVER FRONT VIEW POINT) నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాజమహేంద్రవరం అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన ప్రాంతం. ఆదికవి నన్నయ్య, ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ నడయాడిన నేల. ఎందరో కళాకారులకు, సామాజికవేత్తలకు జీవితాన్ని ప్రసాదించిన నేల. ఈ నేల ప్రజలందరి ఆకలి తీరుస్తూ అన్నపూర్ణగా పేరు గాంచింది… అని వివరించారు.
సమగ్ర అభివృద్ధి సాధించేలా పని చేస్తాం
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాకా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, మేము ముందుగా అనుకున్నది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా ముందుకు తీసుకెళ్లాలని. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఇరత రాష్ట్రాలతో పోటీ పడేలా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనుకున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశాం… అని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదన్నారు. ప్రాజెక్టు మంజూరు కావడంలో తన పూర్తి సహాయ సహకారాన్ని అందించిన పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి కి మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.
ఏపీలో పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అలాగే గోదావరి, కృష్ణా, వంశధార వంటి నదీ తీరాలు ఉన్నాయి. మిగతా దేశాల్లో అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి పెట్టి అభివృద్ధి చేస్తారు. మన దేశంలో మాత్రం నదులు మన జీవన విధానం, సంస్కృతిలో భాగం. అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఘాట్ లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతాం. హేవలాక్ వంతెనకు 127 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిడ్జ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దశాబ్ధాలుగా ఉన్న ఆకాంక్షను సాకారం చేస్తున్నాం. రాజహేంద్రవరం చరిత్ర, విశిష్టతలు, కళారంగాలు ఇలా వివిధ థీమ్ లతో అభివృద్ధి చేస్తున్నాము. వీటితో పాటు చుట్టుపక్క ప్రాంతాలను అభివృద్ధి చేసి 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నాం” అన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి : కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర షెకావత్
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ (GAJENDRA SING SHEKAVATH) మాట్లాడుతూ “అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోంది. దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి శరవేగంగా పుంజుకుంటోంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాము. ఇందులో భాగంగా 127 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన హేవ్ లాక్ వంతెనను ఆదునీకరించడమే కాకుండా దానిని పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు , బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట రాజు, గిడ్డి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, చిర్రి బాలరాజు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ, టూరిజం శాఖ కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి, ఎస్పీ రసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………