*గ్రూప్-1 అధికారుల క్షేత్రస్థాయి శిక్షణ…..
ఆకేరు న్యూస్, డేస్క్: తెలంగాణ ప్రభుత్వ గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించి, వివిధ శాఖల్లో ఉన్నత పదవులకు ఎంపికైన అధికారుల బృందం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి శిక్షణ (Field Training) నిర్వహించారు. ఒక ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు డీఎస్పీలు, ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు ఈ బృందంలో ఉన్నారు. శిక్షణలో భాగంగా అధికారులు గ్రామంలోని వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును, సంక్షేమ పథకాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ (శుభ్రత) పనులను వీధి వీధి తిరిగి పర్యవేక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై, వారి ఆర్థికాభివృద్ధి మరియు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. రెండవ రోజున అధికారులు స్థానిక ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా సౌకర్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ముచ్చటించారు. విరాట్ నగర్లోని చేతివృత్తి కళాకారులను కలిసి, వారి వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకోవడం విశేషం. శిక్షణ ముగింపులో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ మరియు పాలనా అంశాలపై ఎంపీడీవో సుజాత, ఈవోఆర్డీ ఇందుజా, కార్యదర్శి హరికృష్ణ అధికారులకు అవగాహన కల్పించారు. అంతకుముందు సర్పంచ్ అనంతుల శ్రీను అధికారులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరాటి మహేష్, వార్డు సభ్యులు, సీడీపీవో సక్కుబాయి, సూపర్వైజర్ సుగుణ, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ శేఖర్, ఏఈఓ మరియు ఇతర మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
