State Mega Rythu Mela
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ నగరంలోని చారిత్రాత్మక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం మూడు రోజుల పాటు అన్నదాతల చైతన్య వేదికగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా గురువారంతో అత్యంత వైభవంగా ముగిసింది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన, రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేయడంలో తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ మూడు రోజుల మేళా రైతాంగంలో ఒక నూతన దృక్పథాన్ని నింపిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. “మా ప్రభుత్వం మాట ఇచ్చిందంటే తప్పదు. ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశాం. రైతులకు నాణ్యమైన సన్నబియ్యం రేషన్ ద్వారా అందిస్తున్నాం. ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించాలని చూస్తున్నా, రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు,” అని ఆయన ఉద్ఘాటించారు.
ఈ భారీ బహిరంగ సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.
అధికార యంత్రాంగం తరపున వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హనుమకొండ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కుడా (KUDA) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
