SRH VS RCB IPL 2026 Match UPPAL
* ప్రేక్షకులకు సీపీ సుమతి కీలక సూచనలు
* సీట్ల మార్పిడి కుదరదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు (శుక్రవారం) రాత్రి 7:30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఉప్పల్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సుమతి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
* ముఖ్యమైన మార్గదర్శకాలు…
ముందుగానే చేరుకోవాలి: ఆఖరి నిమిషం రద్దీ, తనిఖీల దృష్ట్యా ప్రేక్షకులు మ్యాచ్ ప్రారంభానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి.
* డిజిటల్ గేట్ మ్యాప్…
ప్రేక్షకుల సౌకర్యార్థం జొమాటో డిస్ట్రిక్ట్ (Zomato District) యాప్లో డిజిటల్ గేటు మ్యాప్ సదుపాయం కల్పించారు. QR కోడ్ స్కాన్ చేసి కేటాయించిన ఎంట్రీ గేటును సులభంగా చేరుకోవచ్చు.
* నకిలీ, బ్లాక్ టికెట్లపై నిఘా…
ఫేక్ టికెట్ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. దీనికోసం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు.
* నిషేధిత వస్తువులు…
బ్యాగులు, ల్యాప్టాప్లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహార పదార్థాలు, లైటర్లు, సిగరెట్లు, ప్లాస్టిక్ వస్తువులను లోపలికి అనుమతించరు. స్టేడియం వద్ద క్లోక్రూమ్ సదుపాయం లేదు.
* ట్రాఫిక్ ఆంక్షలు…
ఉప్పల్, నాగోల్ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వాలిడ్ పార్కింగ్ పాస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. ప్రేక్షకులు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అదనపు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
* భద్రత & అత్యవసరం…
430కి పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. మహిళల రక్షణకు ‘షీ టీమ్స్’ అందుబాటులో ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ చూడాలని లేదా తక్షణమే డయల్ 100కు కాల్ చేయాలని సీపీ సుమతి సూచించారు.
