Heatwave Alert Telangana Andhra Pradesh summer 2026
* మే 24 వరకు డేంజర్ బెల్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను ప్రచండ భానుడు అగ్నిగుండంగా మార్చేశాడు. ముнуపెన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఎండ వేడికి, వడగాల్పుల ధాటికి తెలంగాణలో గురువారం ఒక్కరోజే ఏకంగా 22 మంది మృత్యువాత పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తుండటంతో ఇరు రాష్ట్రాల్లోని రహదారులన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి.
* ఉమ్మడి వరంగల్లోనే 9 మంది మృతి…
భానుడి ఉగ్రరూపానికి తెలంగాణలో ఒకేరోజు 22 మంది ప్రాణాలు కోల్పోగా, ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, పొలం పనులకు వెళ్లిన అల్పాదాయ వర్గాల వారేనని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 244 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి.
సూర్యాపేట జిల్లాలోని 29 మండలాలపై దీని ప్రభావం అత్యంత ఎక్కువగా కనిపించింది. ముత్తారం, మునగాల వంటి ప్రాంతాల్లో గరిష్టంగా 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
* ఏపీలో 55 డిగ్రీలకు చేరువలో..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర అధికారిక హెచ్చరికలు జారీ చేసింది. మే 20 నుండి మే 24 వరకు ఎండల తీవ్రత పతాక స్థాయికి చేరనుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల మధ్య ఉష్ణోగ్రతలు మరియు ఎండ తీవ్రత (Heat Index) 45°C నుండి ఏకంగా 55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ ఐదు రోజుల పాటు నిర్దేశిత సమయాల్లో ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఏపీ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
* స్తంభించిన ప్రజాజీవనం.. అల్లాడుతున్న రంగాలు
తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఉభయ రాష్ట్రాలలోనూ సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మధ్యాహ్నం వేళల్లో వ్యాపార సముదాయాలు సైతం మూతపడుతున్నాయి. ఎండల దెబ్బకు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది, దీనివల్ల గ్రిడ్లపై అదనపు భారం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులు చేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
