RTC employees issues committee
* జీవో ఎంఎస్ నెం.66 విడుదల
* సమస్యలపై నాలుగు వారాల్లో నివేదిక
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ లో తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న పలు సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించేందుకు ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.66ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు మంగళవారం జారీ చేశారు.
* ఈ కమిటీ లో…..
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ – చైర్మన్
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ – సభ్యుడు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ – సభ్యుడు
వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ – సభ్యుడు, కన్వీనర్ ఈ కమిటీలో ఉన్నారు
ఈ కమిటీ ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఉత్తర్వులు జారీ చేసిన నేటి నుండి నాలుగు వారాల్లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు, పేద ప్రజలు ఆర్టీసీపై ఆధారపడుతున్నారు. వారికి ఈ బస్సులే లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కార్మిక ప్రతినిధులంతా ఎలాంటి సంకోచాలు లేకుండా తమ డిమాండ్లను కమిటీ ముందు ఉంచాలని కోరుతున్నాను. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఉప ముఖ్యమంత్రి గారు, నేను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోలో తెలిపారు.
