Tummala Mega Rythu Mela
ఆకేరు న్యూస్ హన్మకొండ: రైతు కష్టాలు తెలిసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం మన రాష్ట్ర రైతాంగానికి గర్వకారణమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘మెగా రైతు మేళా-2026’ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
* తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపిన మంత్రి
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మంత్రి తుమ్మలతో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “నేను పాల్వంచలో సీఐగా ఉన్నప్పుడు, ఒక పని మీద మంత్రి వద్దకు వెళ్తే.. ఆయన స్వయంగా తలపాగా ధరించి ట్రాక్టర్ నడుపుతూ పొలం పనుల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అంతటి నిరాడంబరత, రైతు జీవితంపై అవగాహన ఉన్న నాయకుడు ఆయన” అని కొనియాడారు.
* BRS తీరుపై ధ్వజం
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు మోసపోయారని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. అయినా మార్పు రాకుండా సభల్లో చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, మళ్ళీ వారికి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే నిలిచారని స్పష్టం చేశారు.
* సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం చారిత్రాత్మక అభివృద్ధి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
