MLA Kadiyam Srihari Young India Integrated Residential School
* ఏడాది లోపు ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి
* మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
4 గురుకులాలు, 2600 మంది విద్యార్థులు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి అవుతాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం దుర్గ్య తండా సమీపంలో నిర్మాణం అవుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలకు అనుకోని ఉన్న స్థానిక దుర్గ్య తండా పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక స్థలాన్ని పాఠశాలకే కేటాయించడం జరిగిందని, ప్రకృతి వనం, స్మశాన వాటిక ఏర్పాటుకు మరొక చోట గుర్తించిన ఎకరం స్థలాన్ని వెంటనే గ్రామ పంచాయితీకి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రెండు మూడు రోజులలో సమస్య పరిష్కారం కావాలని సూచించారు. అయితే కొంతమంది పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఒక్కో నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మొదటి విడతలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ పాఠశాలలో 4 గురుకులాలు 2600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. అత్యాధునిక అకాడమీక్ బ్లాక్, ల్యాబ్, హాస్టల్స్, ఉపాధ్యాయుల వసతి గృహాలు, క్రీడా మైదానాలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కాంట్రాక్టర్ కు పరిపాలనపరమైన అనుమతులకు సంబందించిన సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. పనుల పురోగతిపై నెలకు ఒకసారి పనుల ప్రోగ్రెస్ ను తయారు చేయాలని సూచించారు. మే 2027 వరకు పాఠశాల నిర్మాణ పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు. ఈ ఇంటిగ్రెటెడ్ పాఠశాలను బాలికలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బాలికల భద్రతతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఏడాదిలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు కానుకగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకల ఐలయ్య, తీగల కర్ణాకర్ రావు, ఇల్లందుల బేబీ శ్రీనివాస్, సుదర్శన్, కనకయ్య, ఎల్లయ్య, మోహన్ రావు, మమత, కౌన్సిలర్ సంపత్ రాజు, కో ఆప్షన్ సభ్యులు బూర్ల లతా శంకర్, గన్ను నరసింహులు విద్యా శాఖ అధికారులు, ఆర్డివో, తహసీల్దార్, ఇతర అధికారులు, కాంట్రాక్టర్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
