Mulugu Collector Borkhade Hemanth Sahadeva Rao Development Review Meeting
* వీవో భవనాల నిర్మాణాలు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు:
ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని, వీవో భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఉపాధి హామీ పథకం, వీవో భవనాల నిర్మాణ పురోగతి, ఇందిరమ్మ ఇండ్లు, ప్లాంటేషన్, సామాజిక భద్రతా పెన్షన్లు, ఇందిరా మహిళా శక్తి కేంద్రం, పెట్రోల్ బంక్ ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచి ఉపాధి కల్పించాలన్నారు.వీవో భవనాలు యుద్ధ ప్రాతిపదికన నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కల నాటే కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో అమలవుతున్న వివిధ కేటగిరీల సామాజిక భద్రతా పెన్షన్లు, ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైన వారి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లా ఇందిరా మహిళా శక్తి కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తాడ్వాయి మండలం కొండపర్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిర్చి–పసుపు ప్రాసెసింగ్ యూనిట్, ఇప్పపూల లడ్డు తయారీ యూనిట్ కార్యకలాపాలు, ఉత్పత్తుల క్రయవిక్రయాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెట్ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు,డీఆర్డీఏ పిడి చంద్రశేఖర్, అదనపు పీడి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
