* ములుగు ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్
ఆకేరు న్యూస్,ములుగు:మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం వెనుక పోలీసుల కృషి గొప్పదని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీసులు గడిచిన 40 రోజులుగా రేయింబవళ్లు శ్రమించారని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ వంద శాతం అంకితభావంతో పని చేయడం వల్లే జాతర ప్రశాంతంగా ముగిసిందని ఆయన ప్రశంసించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగామని తెలిపారు.
జాతర సమయంలో అక్కడక్కడ తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులపై ఎస్పీ స్పష్టతనిచ్చారు..
పస్రా – తాడ్వాయి – మేడారం రూట్లో అటవీ శాఖ అనుమతులు రాకపోవడం వల్ల రోడ్డు విస్తరణ పనులు జరగలేదని, ఇరుకైన రోడ్ల కారణంగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ఆయన వివరించారు. గట్టమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని పేర్కొన్నారు.రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని, అది కేవలం భక్తుల సౌకర్యం కోసమే తప్ప ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.వచ్చే జాతర నాటికి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………………………..
