Nizamabad Husband Murder Case
ఆకేరు న్యూస్, నిజామాబాద్: పరాయి వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడనే కక్షతో ఒక భార్య కన్నబిడ్డల తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘోర ఉదంతం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
* డాబాపై నుంచి తోసేసి..
న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య దంపతులు. సంధ్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. గత నెల 30వ తేదీన భర్త ప్రశాంత్ను ఇంటి డాబాపై నుంచి కిందకు తోసేసింది.
* ఆస్పత్రిలో టాయిలెట్ క్లీనర్తో ఘాతుకం
బిల్డింగ్పై నుంచి పడటంతో తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్ను బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అక్కడితో సంధ్య కసి తీరలేదు. ఆసుపత్రిలో అందరూ లేని సమయం చూసి, భర్త ప్రశాంత్కు సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్ క్లీనర్ను శరీరంలోకి ఎక్కించింది. దీంతో ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
* పోలీసుల విచారణలో వీడిన మిస్టరీ..
కొడుకు మరణంపై, కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రశాంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. భర్తను తానే హతమార్చినట్లు సంధ్య అంగీకరించింది. ఈ ఘోరానికి సహకరించిన భార్య సంధ్యతో పాటు, ఆమె ప్రియుడిని, అతడికి సహాయం చేసిన స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
