
* భాగ్యనగరంలో బోనాల జాతరకు వేళాయె..
* నెల రోజులూ డిల్లం డల్లం మోతలే
* గోల్కొండ కోటలో నేడు తొలి బోనం
* పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం
* బోనాలకు 600 ఏళ్ల చారిత్రక విశిష్ఠత
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : శివసత్తుల నృత్యాలు.. డిల్లం డల్లం మోతలు.. పోతురాజుల విన్యసాల మధ్య అమ్మకు బోనం సమర్పించేందుకు వేళయింది. నువ్వు పెద్దపులి.. నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో అంటూ ఊరూ వాడా ఆడిపాడే సమయం ఆసన్నమైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన బోనాల జాతర భాగ్యనగరంలో నేడే ప్రారంభం కానుంది. గురువారం వేడుకలు ఆరంభం కానుండగా ఆషాఢ మాసమంతా హైదరాబాద్లో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్రకారులు చెబుతారు. ఇక 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమవారికి బోనాలు సమర్పించారని ప్రతీతి.
మొదటి బోనం గోల్కొండ ఎల్లమ్మకే..
బోనాలులో భాగంగా చారిత్రక గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంబిక(గోల్కొండ ఎల్లమ్మ) ఆలయంలో మొదటి పూజ చేసి తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తారు. గోల్కొండ బోనాల తర్వాత సికిద్రాబాద్ ఉజ్జయిని మహాకాళీ, లాల్దర్వాజ మహాకాళి ఆలయాలలో పూజలు జరుగుతాయి. తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాలలో బోనాలు ప్రారంభవముతాయి. ఇక ఆషాడం మాసంలో చివరి రోజు తిరిగి గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాలు ఉత్సవాలు సమాప్తం అవుతాయి.
అనాదిగా వస్తున్న సంప్రదాయం
గోల్కొంట కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులికుతుబ్షా కాలం నుంచి వస్తోంది. అప్పట్లో కులీకుతుబ్షా నిర్వహించగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహి స్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేస్తుంది. బోనాలు ఉత్సవాలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీజగదాంభిక ట్రస్టుబోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈనెల 22న లంగర్హౌజ్ నుంచి తొట్టెల ఊరేగింపు, చోటాబజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం నిర్వహించడం అనేక సంవత్సరాలుగా వస్తుంది.
నెలంతా పండుగే
ఈనెల 26నుంచి జూలై 24వతేదీ వరకు తెలంగాణలో బోనాల జాతర జరుగనుంది. నెలరోజుల పాటు ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరం నలుమూలల నుంచే కాక, రంగారెడి, మహాబూబ్నగర్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. వీరికోసం గాను గోల్కొండలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడిగార్డ్స్ లైన్స్ ప్రాంతాలు సిద్ధం చేస్తున్నారు. అయితే పాత కమిటీ రద్దు కావడం, కొత్త కమిటీ నియమాకానికి సమయం పడుతుండడతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీజగదాంభిక ట్రస్టు బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నగరంలోని పలు ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు ప్రత్యేకంగా అదనపు బస్సులను నడుపనున్నారు.
9 పూజలు.. ఏ పూజ ఎప్పుడంటే..
జూన్ 26న మొదటి పూజ
జూన్ 29న రెండవ పూజ
జూలై 3న మూడవ పూజ
జూలై 6న నాల్గవ పూజ
జూలై 10న ఐదవ పూజ,
జూలై 13న ఆరవపూజ
జూలై 17న ఏడవ పూజ,
జూలై 20న ఎనిమిదవ పూజ
జూలై 24న తొమ్మిదవ పూజ
నేడు ఇలా..
తొలి పూజ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం లంగర్హౌజ్లో ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటాబజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు చేసి అక్కడి నుంచి బోనాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడంతో మొదటి పూజ ముగుస్తుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహియుద్దీన్, మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొననున్నారు.
……………………………………………..