Pawan Kalyan Controversy Pruthvi
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
తెలంగాణవాదుల ముసుగులో కొందరు వ్యక్తులు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారని జనసేనపార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వీ మండిపడ్డారు. శనివారం డివిజన్ కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏనాడు తెలంగాణవాదానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. తెలంగాణ పట్ల గౌరవం పలు జనసేన సభల్లో గుర్తుచేశారన్నారు. తెలంగాణ యువత పోరాట పటిమపై ఎన్నో సార్లు గొప్పగా వ్యాఖ్యనించారని తెలిపారు.
అటువంటి వ్యక్తిపై గత వారం రోజులుగా కొందరు విలువలు లేని వ్యక్తులు నీచమైన బాషాతో, అనైతికమైన చేష్టలతో కించపరిచే విధంగా మాట్లాడడం సరి అయింది కాదన్నారు. దేశ ప్రధాని చేత ప్రశంసలు పొందిన వ్యక్తిత్వం, కోట్ల మంది అభిమానులు ఉన్న అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని కొందరు సంఘ విద్రోహులు కుట్ర చేస్తున్నట్లు చేయడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్ట్ ముసుగులో కొన్ని పెయిడ్ యూట్యూబ్ చానెల్స్ జనసేనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ను విమర్శించే వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలంగాణకి ఏ విపత్తు వచ్చిన కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాడని, ఇటీవల కొండగట్టు అభివృద్ధికై రూ. 39 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ కోసం కృషి చేసారన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని అన్నీ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం మర్చిపోవొద్దని హెచ్చరించారు. సామాన్య యువతకు రాజకీయ అవకాశం కలిపించిన గొప్ప వ్యక్తిత్వం గల పవన్ కళ్యాణ్ మీద నియోజకవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నించారని మండిపడ్డారు.
అమరవీరుల కుటుంబ ముసుగులో బాల్లే పూలమ్మ అనే మహిళ తన స్థాయి మరిచి విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది అన్నారు. ఆమె భర్త కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటే ఉద్యమ ఉదృతంగా ఉన్న సమయంలో తెలంగాణ సాధన కోసం అన్నట్లు చిత్రికరించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మీద చేసిన దుశ్చర్యకు సొంత గ్రామస్తులే ఛీ కొడుతున్నారన్నారు. ఆమె వెంటనే బేషరత్తుగా పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆమంచ సునీల్, మెడిద ప్రశాంత్, రాజోజు రాజశేఖర్, అక్కెనపల్లి సాయి, రాజేష్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
