CM Revanth reddy
*పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
* కోర్టులు రాజకీయ యుద్ధ వేదికలు కావని చురక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ(BJP) నేతలువేసిన పరువునష్టం కేసును సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టులను రాజకీయ రంగానికి యుద్ధ వేదికలుగా మార్చ వద్దని చురక అంటించింది.2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం (KOTHAGUDEM)సభలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. ఆయన మాటలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ నేతలు ఇది బీజేపీ పరువుకు భంగం కలిగించేలా ఉందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు (KASAM VENKATESHWARLU) గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు.దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-125 కింద కేసు కొనసాగుతుందని కోర్టు తెలిపింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలలో ఇలాంటి వి సహజమని వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టు(SUPREM COURT)లో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి(JUSTICE BR GAVAI) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కొట్టివేసింది. అంతేకాదు, కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని పిటిషనర్ అయిన బీజేపీ నేతపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు మరీ సున్నితత్వంతో ఉంటే బావుండేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
