
* అంగన్వాడీల అరెస్ట్ పై హరీశ్రావు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యం లో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? కనీస వేతనం డిమాండ్ చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్లపై (Anganwadi Teachers) రేవంత్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటని విమర్శించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగులుతుంది అని దుయ్యబట్టారు. అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ (kcr) వారు వర్కర్లు కాదని, అంగన్వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు. 2014 నాటికి అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని అన్నారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహాలక్ష్మి (Mahalaxmi) పేరిట మీరు అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లోనే జిల్లాల నుంచి సచివాలయం వద్దకు వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారని తెలిపారు.