ఆకేరు న్యూస్, డెస్క్ : రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి సంచలన ఫిర్యాదు..రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగినిని గత ఏడాదిన్నరగా బెదిరింపులకు గురిచేస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా సదరు మహిళతో పరిచయం పెంచుకున్న ఎమ్మెల్యే, ఆపై ఆమెను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత 18 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం.భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని వేధించడమే కాకుండా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.”నేను ఎమ్మెల్యేని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
……………………………………………..
