* డ్రగ్స్ రహిత స్టేషన్ ఘన్ పూర్ కావాలి
.. డిసిపి రాజమహేంద్ర నాయక్
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
బాధ్యతాయుత సమాజాన్ని నిర్మించేందుకు చేయి చేయి కలిపి డ్రగ్స్ రహిత స్టేషన్ ఘన్ పూర్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మా గార్డెన్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక సీఐ జి.వేణు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిసిపి మాట్లాడుతూ పిల్లల ప్రవర్తన, అలవాట్లపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. డ్రగ్స్, మత్తుపదార్థాల వాడకం యువతలో బాగా పెరిగిందని అది నివారించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రధానంగా వేరే రాష్ట్రాల నుండి గంజాయిని మన రాష్ట్రంలోకి తీసుకువచ్చి యువతకు అలవాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచాలని అప్పుడే దాని నివారణ స్వాధ్యమవుతుందన్నారు. సరఫరాను అరికడితే నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి సరఫరా పట్ల ప్రజలను అప్రమత్తం చేసి వారి పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి వల్ల సమాజం నష్ట పోతుందని భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అందుకోసం గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహనతో, అప్రమత్తతో వ్యవహరిస్తూ డ్రగ్స్ మహమ్మారని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, ఎఫ్ ఆర్ ఓ చంద్రకాంత్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ దేవేందర్, సిడిపిఓ స్వరూప, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో విజయశ్రీ, ఎంఈఓ కొమరయ్య, డాక్టర్ అజయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

