Kishan Reddy Revanth Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, కేంద్ర నిధుల నిలిపివేతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు నిధులు రాకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సీఎం చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..
తెలంగాణ రాష్ట్ర పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిధుల విషయంలో ఎప్పుడూ వివక్ష చూపలేదని స్పష్టం చేశారు.
“తెలంగాణతో పాటు హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధి విషయంలో మా నిబద్ధతపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. రాష్ట్రం, నగర అభివృద్ధి అంశాల్లో మాకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పనిలేదు” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
* రాజకీయాలు వద్దు.. అభివృద్ధి ముద్దు…
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజోపయోగకర కార్యక్రమాలపై పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయ విమర్శల్లోనే మునిగిపోకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
