Eturnagaram Agricultural Lands Protest
ఆకేరు న్యూస్,ములుగు:
ఏటూరునాగారం మండల కేంద్రంలో స్థానిక రైతుల, గిరిజనేతరుల భూములను,వలస వచ్చిన గిరిజనులు అక్రమంగా ఆక్రమించడాన్ని నిరసిస్తూ, మంగళవారం ఏటూరునాగారంలో స్థానిక జెఏసి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన ప్రశాంతంగా ముగిసింది.
పలు ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది గిరిజనులు, పురాతన కాలం నుండి ఇక్కడి స్థానిక గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న సొంత భూములలో అక్రమంగా చొరబడి గుడిసెలు వేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా భూమి మా హక్కు “గిరిజనేతరుల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో కూడిన భారీ బ్యానర్లతో స్థానిక గిరిజనేతర నేతలు, ప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.
అక్రమంగా నిర్మించిన గుడిసెలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు శాంతియుత ధర్నాకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఐదు మండలాలకు చెందిన భారీ పోలీస్ బలగాలు రంగంలోకి దిగి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ తాము ఇక్కడ తరతరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నాము. అన్నదమ్ముల్లా ఉన్న ఈ సమాజంలో, బయటి ప్రాంతాల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటూ గొడవలు సృష్టిస్తున్నారని. ఆరోపించారు.
దీని పై ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ గుడిసెలను తొలగించి, స్థానిక రైతులకు న్యాయం చేయాలి.” అని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జెఏసి కమిటీ నాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజనేతర రైతులు ప్రజలు పాల్గొన్నారు.
