* నేరాంగీకరణానికి ఆమోదం తెలిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్
* బ్రిటన్లో గడిపిన నిర్భంధ కాలాన్నే శిక్షగా పరిగణిస్తూ విడుదల
ఆకేరు న్యూస్ డెస్క్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు (Julian Assange) జైలు శిక్ష నుంచి ఊరట లభించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుపై ఉత్కంఠకు తెరపడింది. గూఢచార్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. అంతకంటే ముందు మూడు గంటల పాటు అసాంజేను కోర్టులో విచారించారు. అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందేందుకు.. వాటిని బహిర్గతం చేసేందుకు కుట్ర పన్నానని అసాంజే కోర్టు ఎదుట అంగీకరించారు. యూఎస్కు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్లో ఉన్న కోర్టులో అసాంజేను విచారించారు. అమెరికాకు రావడానికి అసాంజే నిరాకరించడంతో అక్కడ విచారణ జరిపారు. విచారణలో భాగంగా అసాంజే.. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా.. రహస్య పత్రాలను సేకరించి, ప్రచురించినట్లు కోర్టు ఎదుట వెల్లడించారు. అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే స్పష్టం చేశారు. అయితే జూలియన్ అసాంజే నేరాన్ని అంగీకరించడాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ రమొననావి. మంగోవా ఆమోదించారు. ఈ మేరకు అసాంజే బ్రిటన్లో గడిపిన నిర్భంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుతో అసాంజే యూకే, యూఎస్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ప్రత్యేక విమానంలో కాన్బెర్రాకు (Canberra) వెళ్లారు. ఈ కేసులో అసాంజే విడుదలను ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ (Albanese) స్వాగతించారు. ఈ కేసులో సానుకూల పరిణామం కోసం తమ ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశామని వెల్లడించారు.
—————————-